రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కొంత ఊరట కలిగించేలా Telangana State Public Service Commission (టీజీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇకపై నెలకో నోటిఫికేషన్ విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ పొందిన సుమారు 2500 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేస్తూ ఎగ్జామ్ షెడ్యూల్ రూపొందించడంలో కమిషన్ అధికారులు నిమగ్నమయ్యారు.
ఇటీవల Telangana Pollution Control Board లో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ నెల 27 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అదే విభాగంలో మరికొన్ని పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్లు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నారు. వీటితో పాటు టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఇంజినీర్ (AE), డిప్యూటీ ఈఓ వంటి కీలక పోస్టుల భర్తీకి కూడా లైన్ క్లియర్ అయింది. విద్యాశాఖలో డైట్ లెక్చరర్లు, బీఈడీ లెక్చరర్లు, అలాగే ఆర్టీసీ, సివిల్ సప్లై శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.
ఈసారి పరీక్షల షెడ్యూల్ కూడా అభ్యర్థులకు అనుకూలంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. పరీక్షల మధ్య తగిన విరామం ఇస్తూ ప్రిపరేషన్కు సరిపడ సమయం కల్పించేలా టీజీపీఎస్సీ చర్యలు తీసుకుంటోంది. అయితే కొత్త నోటిఫికేషన్లకు అప్లై చేయాలంటే ఓటీఆర్ (One Time Registration) అప్డేట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది ఓటీఆర్ కలిగి ఉన్నప్పటికీ, కేవలం 6 లక్షల మంది మాత్రమే దాన్ని అప్డేట్ చేసుకోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే, టీజీపీఎస్సీ తీసుకుంటున్న ఈ చర్యలు నిరుద్యోగులకు పూర్తిస్థాయి ఉపశమనం కలిగిస్తాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీలు ఇచ్చిన నేపథ్యంలో, ఇప్పటి వరకు సుమారు 50 వేల ఉద్యోగాలే భర్తీ అయ్యాయని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం 2500 పోస్టులతో మాత్రమే పరిమితం కావడం నిరుద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతోంది.
మరోవైపు, ప్రభుత్వ విభాగాల్లో పదవీ విరమణ వయస్సు దాటిన అధికారులు ఇంకా కొనసాగుతుండడం కూడా ఖాళీలు సృష్టించడంలో అడ్డంకిగా మారిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ ఉద్యోగులు పదవులు ఖాళీ చేస్తేనే కింది స్థాయిలో ప్రమోషన్లు, తద్వారా కొత్త నియామకాలకు మార్గం సుగమం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
మొత్తానికి, నెలకో నోటిఫికేషన్ అనే ఆలోచన సానుకూలంగానే ఉన్నప్పటికీ, అది వాస్తవంగా ఎంతవరకు అమలవుతుందో, నిరుద్యోగ సమస్యను ఎంతవరకు తగ్గిస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే నిరుద్యోగులు ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నారు.

