దేశంలో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లు, ఇంధన వినియోగంపై చర్చ నడుస్తున్న సమయంలో ప్రధాని Narendra Modi పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రధాని తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించడమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ప్రధాని కాన్వాయ్లో సాధారణంగా 12 నుంచి 15 వాహనాలు ఉండగా వాటిని సగానికి తగ్గించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే Amit Shah కూడా తన కాన్వాయ్ను 11 వాహనాల నుంచి ఐదుకు కుదించారట. కొందరు కేంద్ర మంత్రులు మెట్రో రైళ్లు, ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించడం కూడా చర్చకు దారితీసింది.
Maharashtra ప్రభుత్వం మంత్రులు అనవసర విదేశీ పర్యటనలు తగ్గించాలని, వీలైనంత వరకు వర్చువల్ సమావేశాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులు తమ విదేశీ పర్యటనలను కూడా రద్దు చేసుకున్నారని సమాచారం. అలాగే Yogi Adityanath నేతృత్వంలోని Uttar Pradeshలో కూడా మంత్రుల కాన్వాయ్లపై కోతలు విధించారట.
అయితే ఈ నిర్ణయాలపై సామాన్యుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. “కాన్వాయ్లో రెండు కార్లు తగ్గించడం కంటే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తే ప్రజలకు నిజమైన ఉపశమనం లభిస్తుంది” అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పెట్రోల్ వినియోగం తగ్గించాలని చెప్పే ప్రభుత్వం, మరోవైపు సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్లు, ఇతర అవసర వస్తువుల ధరలు పెరగడాన్ని అరికట్టడంలో విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి.
మిడిల్ క్లాస్ కుటుంబాలపై పెరుగుతున్న జీవన వ్యయం భారీ భారం అవుతోందని ప్రజలు అంటున్నారు. పెట్రోల్ వాడకం తగ్గించమని చెప్పే ముందు ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, కొత్త బస్సులు పెంచాలని, ప్రయాణ సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక విమర్శకులు మాత్రం “ప్రజలపై పొదుపు భారం మోపే బదులు, ప్రజాప్రతినిధుల జీతాలు, అనవసర ఖర్చులు తగ్గిస్తే మంచిది” అని అంటున్నారు. కాన్వాయ్ కోతలు ప్రతీకాత్మక చర్యలే కానీ, సామాన్యుడి జీవితంలో పెద్ద మార్పు తీసుకురావని అభిప్రాయపడుతున్నారు.

