మరోసారి ఏసీబీకి చిక్కిన డీఈ ముత్యం వెంకటరమణ.. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులపై దర్యాప్తు

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి భారీ అవినీతి కేసును వెలుగులోకి తీసుకొచ్చింది. ఖైరతాబాద్‌లోని తెలంగాణ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGREDCO) డివిజనల్ ఇంజనీర్ (డీఈ) ముత్యం వెంకటరమణపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.

హైదరాబాద్‌లోని మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో స్థిర, చర ఆస్తులు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అధికారిక పత్రాల ప్రకారం సుమారు రూ.27.65 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించగా, బహిరంగ మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

భారీ స్థిరాస్తులు

దర్యాప్తులో భాగంగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో నాలుగు విలాసవంతమైన ఫ్లాట్లు గుర్తించారు. అలాగే గుట్టల బేగంపేటలో జీ+5 కమర్షియల్ భవనం ఉన్నట్లు తేలింది. వీటితో పాటు ముత్యం వెంకటరమణ తన భార్య పేరిట నాలుగు నిర్మాణ సంస్థలను నమోదు చేసి, వాటి ద్వారా భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.

మూసాపేట, కూకట్‌పల్లి, ఆంజనేయనగర్ ప్రాంతాల్లో సుమారు రూ.20 కోట్ల పెట్టుబడితో 10 అపార్ట్‌మెంట్‌ల నిర్మాణం చేపట్టినట్లు విచారణలో వెల్లడైంది.

నగదు, బంగారం, కార్లు

ఏసీబీ దాడుల్లో వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.52 లక్షలకు పైగా నగదు నిల్వలు, సుమారు రూ.1 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నాలుగు విలాసవంతమైన కార్లు, రూ.30 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా ఇంట్లో సుమారు 20 విదేశీ మద్యం సీసాలు కూడా లభించినట్లు అధికారులు తెలిపారు. బినామీ పేర్లపై ఉన్న మరిన్ని ఆస్తుల వివరాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

ఇది మొదటిసారి కాదు

ముత్యం వెంకటరమణ గతంలో కూడా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. 2019లో సైబర్ సిటీ సర్కిల్‌లో సూపరింటెండింగ్ ఇంజనీర్ (టెక్నికల్)గా పనిచేస్తున్న సమయంలో ఓ ఫైల్ ఆమోదానికి రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఆ సమయంలో నిర్వహించిన సోదాల్లో రూ.26.52 లక్షల నగదు, రూ.22.60 లక్షల విలువైన బంగారం, ఇతర ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి చార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు.

కఠిన చర్యలపై చర్చ

ఇప్పటికే ఒకసారి అవినీతి కేసులో పట్టుబడిన అధికారి మళ్లీ ఉద్యోగంలో కొనసాగి, మరోసారి భారీ అక్రమాస్తుల కేసులో చిక్కుకోవడం పరిపాలనా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

అవినీతి నిరోధానికి కేవలం కేసులు నమోదు చేయడం మాత్రమే కాకుండా, నిరూపితమైన అవినీతి కేసుల్లో కఠిన శిక్షలు, సేవల నుంచి తొలగింపు వంటి చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా చేస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *