నీట్ (NEET) పరీక్షను పూర్తిగా రద్దు చేసి, 12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అభిప్రాయపడ్డారు. తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో తొలిసారిగా ప్రసంగించిన ఆయన, నీట్ పరీక్ష విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు.
గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నీట్ పరీక్ష అన్యాయం చేస్తోందని విజయ్ పేర్కొన్నారు. ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లే అవకాశం లేని విద్యార్థులు పోటీలో వెనుకబడుతున్నారని, అందువల్ల ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు జరగడం మరింత న్యాయసమ్మతమైన విధానమని అభిప్రాయపడ్డారు.
ఇటీవలి కాలంలో నీట్ పరీక్షల నిర్వహణలో పేపర్ లీకేజీలు, అవకతవకల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దేశానికి నీట్ అవసరమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేయకుండా ప్రత్యామ్నాయ ప్రవేశ విధానాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
తమిళనాడు ప్రభుత్వం మొదటి నుంచే నీట్కు వ్యతిరేకంగా పోరాడుతోందని గుర్తుచేసిన విజయ్, రాష్ట్రం ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ అడ్మిషన్ విధానానికి తమ ప్రభుత్వం కూడా పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
ఇక భాషా విధానంపై కూడా విజయ్ తన ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న త్రిభాషా సూత్రాన్ని తమ ప్రభుత్వం అంగీకరించదని, తమిళనాడులో అమలులో ఉన్న ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని తెలిపారు. తమిళం మరియు ఇంగ్లీష్ భాషలకు ప్రాధాన్యం ఇచ్చే విధానమే రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలమని చెప్పారు.
హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను తమిళనాడు అంగీకరించదని విజయ్ హెచ్చరించారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, భాషా వైవిధ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
నీట్ రద్దు, ద్విభాషా విధానం, విద్యా సమానత్వం వంటి అంశాలపై సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారాయి.

