దేశంలో ఇప్పటికే పెరిగిన ద్రవ్యోల్బణం, గ్యాస్ ధరలు, విద్యుత్ బిల్లులు, అద్దెలు, విద్యా ఖర్చులతో సతమతమవుతున్న సామాన్యుడికి మరో భారీ షాక్ తగలబోతోంది. రోజువారీగా ప్రతి ఇంట్లో ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలను పెంచేందుకు ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలు సిద్ధమవుతున్నట్లు సమాచారం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, పానీయాలు, వాటర్ బాటిల్స్, షాంపూలు వంటి ఉత్పత్తుల ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముడి చమురు ధరలు పెరగడం, ప్యాకేజింగ్ ఖర్చులు అధికమవడం, రవాణా వ్యయాలు పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరిగాయని కంపెనీలు చెబుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు కూడా ధరల పెరుగుదలకు కారణమని సంస్థలు పేర్కొంటున్నాయి.
ఇప్పటికే కొన్ని ఉత్పత్తుల ధరలను 3 నుంచి 5 శాతం వరకు పెంచినట్లు కంపెనీలు వెల్లడించాయి. అయితే పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరోసారి రెండు అంకెల శాతంలో ధరలు పెంచే అవకాశముందని ఆయా సంస్థల ఎగ్జిక్యూటివ్లు పెట్టుబడిదారులతో నిర్వహించిన సమావేశాల్లో సంకేతాలు ఇచ్చారు.
డాబర్ ఇండియా గ్లోబల్ సీఈఓ మోహిత్ మల్హోత్రా మాట్లాడుతూ తమ కంపెనీ ఇప్పటికే ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కొంటోందని, దాని ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ధరలను పెంచాల్సి వచ్చిందని చెప్పారు. అదే విధంగా బ్రిటానియా సంస్థ కూడా ఇంధనం, ప్యాకేజింగ్ ఖర్చులు దాదాపు 20 శాతం పెరగడంతో కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. గుడ్ డే, మరీగోల్డ్, టైగర్, మిల్కీ బిక్స్ వంటి ప్రముఖ బ్రాండ్లపై ప్రభావం ఉండే అవకాశముంది.
హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థకు చెందిన సర్ఫ్ ఎక్సెల్, బ్రూ, లైఫ్ బాయ్, డవ్, క్లినిక్ ప్లస్, సన్ సిల్క్, లక్మే వంటి ఉత్పత్తుల ధరలు కూడా పెరగవచ్చని సంకేతాలు వస్తున్నాయి. ముడి సరుకుల వ్యయం 8 నుంచి 10 శాతం వరకు పెరిగిందని, అందుకే కొన్ని ఉత్పత్తుల ధరలను ఇప్పటికే 2 నుంచి 5 శాతం వరకు పెంచామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ బ్రాండ్లు ఎక్కువగా సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే ఉత్పత్తులే. ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కూడా చాలామందికి ఒక పూట ఆకలి తీర్చే ఆహారం. అలాంటి ఉత్పత్తులపై కూడా ధరల భారం మోపడం పేద, మధ్యతరగతి కుటుంబాలను మరింత ఇబ్బందుల్లోకి నెడుతోంది.
ధరల పెంపుతో పాటు “శ్రింక్ ఫ్లేషన్” అనే విధానాన్ని కూడా కంపెనీలు అమలు చేస్తున్నాయి. అంటే ధర అదే ఉంచి ప్యాకెట్ పరిమాణాన్ని తగ్గించడం. ఉదాహరణకు ముందుగా 100 గ్రాములుగా ఉన్న ఉత్పత్తిని ఇప్పుడు 85 లేదా 90 గ్రాములకు తగ్గిస్తూ వినియోగదారులపై పరోక్ష భారం మోపుతున్నాయి.
ఇక ప్యాకేజ్డ్ నీళ్లు, పానీయాల ధరలు కూడా పెరిగే అవకాశముందని సంస్థలు సంకేతాలు ఇస్తున్నాయి. అంటే భవిష్యత్తులో సాధారణ వాటర్ బాటిల్ కూడా సామాన్యుడికి భారంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా దేశ ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం, నోట్ల రద్దు తర్వాత బ్లాక్ మనీపై తీసుకున్న చర్యల ఫలితాలపై ప్రజల్లో ఇప్పటికీ అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు బ్లాక్ మనీని కట్టడి చేస్తామని తీసుకొచ్చిన ₹2000 నోట్లు ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ పార్టీలు మాత్రం ప్రజల రోజువారీ సమస్యల కంటే పరస్పర విమర్శలు, రాజకీయ ఆరోపణలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల సమస్యలు, మధ్యతరగతి జీవన భారం వంటి అంశాలపై ప్రభుత్వాలు గట్టిగా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇక తెలంగాణ రాజకీయాల్లో కూడా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 12న పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ, సభ్యత్వ నమోదు, కొత్త ఇంచార్జీల నియామకం, ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమ కార్యాచరణ వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. పార్టీని బలోపేతం చేసేందుకు ఫిల్ట్రేషన్ అవసరమనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే దేశంలో ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతుండగా సామాన్యుడి జీవితం రోజురోజుకీ కష్టతరమవుతోంది. పైసలు ఉన్నవారు మరింత ధనవంతులు అవుతుండగా పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రం ధరల భారం కింద నలిగిపోతున్నారు. రాజకీయ పార్టీలు మాటలకే పరిమితం కాకుండా ప్రజల నిజమైన సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఇప్పుడు మరింతగా కనిపిస్తోంది.

