ఐదేళ్ల విజయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ఓకే టీవీ.. నిజం కోసం అక్షర యుద్ధం కొనసాగిస్తాం

ఐదేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఓకే టీవీ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. “నిజం కోసం ఓకే టీవీ.. జనం కోసం ఓకే టీవీ” అనే నినాదంతో ప్రారంభమైన ఈ మీడియా సంస్థ ప్రజల పక్షాన నిలబడి, అన్యాయాలపై అక్షర యుద్ధం చేస్తూ ముందుకు సాగుతోంది.

రాజ్యాంగ విలువలను దైవంగా, ప్రజాహితాన్ని పరమ లక్ష్యంగా భావిస్తూ ఓకే టీవీ తన జర్నలిజం ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రజా హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య బలోపేతం, సామాన్యుల సమస్యలకు వేదిక కల్పించడం వంటి లక్ష్యాలతో సంస్థ పనిచేస్తోంది.

వ్యవస్థల్లో లోపాలు కనిపించినప్పుడు వాటిని ప్రశ్నించడం, అధికారులను జవాబుదారులుగా నిలబెట్టడం, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం ఓకే టీవీ ప్రత్యేకతగా నిలిచింది. “ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక”గా గుర్తింపు పొందిన ఈ ఛానల్ అనేక సామాజిక అంశాలపై తనదైన ముద్ర వేసింది.

సావిత్రిబాయి ఫూలే, వీరరుద్రమదేవి, దుర్గాబాయి దేశ్‌ముఖ్ వంటి మహనీయుల స్ఫూర్తితో సేవా మార్గంలో సాగుతున్నామని ఓకే టీవీ తన గీతంలో పేర్కొంది. ఒంటరి పోరాటమైనా వెనకడుగు వేయకుండా నిజం కోసం నిలబడతామని, ఎవరూ లేని వారి కోసం తమ గళం వినిపిస్తుందని స్పష్టం చేసింది.

ప్రజల దీవెనలే తమ విజయానికి కారణమని పేర్కొన్న ఓకే టీవీ, భవిష్యత్తులో కూడా నిష్పక్షపాత జర్నలిజంతో ప్రజలకు సేవ చేస్తామని వెల్లడించింది. ఐదేళ్ల విజయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక గీతం ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రజాబలమే తమ బలం అని పేర్కొంటూ నిజం వైపు నిలబడే మీడియా వేదికగా ఓకే టీవీ తన ప్రయాణాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *