గ్యాస్ ఈ-కేవైసీకి ఆగస్టు 16 డెడ్లైన్.. వినియోగదారుల్లో ఆందోళన
వంట గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి వినియోగదారు తప్పనిసరిగా ఈ-కేవైసీ (eKYC) పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు సూచించాయి. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆగస్టు 16 వరకు గడువు ఉండటంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు.
బోగస్ గ్యాస్ కనెక్షన్లను గుర్తించి తొలగించడం, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఎల్పీజీ సబ్సిడీ, సరఫరా అందేలా చూడడమే ఈ-కేవైసీ ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.
అయితే ఈ ప్రక్రియలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. విదేశాల్లో ఉన్న కనెక్షన్ దారులు బయోమెట్రిక్ ఇవ్వలేకపోతున్నారు. ఉజ్వల పథకం లబ్ధిదారులు మరణించిన సందర్భాల్లో కనెక్షన్ వారసుల పేరుకు మారకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వృద్ధుల వేలిముద్రలు నమోదు కాకపోవడం, ఆధార్ వివరాల్లో తేడాలు, ఒకే కుటుంబంలో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉండడం వంటి అంశాలు గందరగోళానికి దారితీస్తున్నాయి.
డెలివరీ సిబ్బంది ఇంటి వద్దకే ఈ-కేవైసీ సేవలు అందిస్తున్నప్పటికీ, సాంకేతిక సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని వినియోగదారులు చెబుతున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే కనెక్షన్ రద్దవుతుందనే భయంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు.
స్టార్ హాస్పిటల్లో భారీ డేటా లీక్.. రోగుల సమాచారం వెబ్సైట్లో
హైదరాబాద్కు చెందిన ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి స్టార్ హాస్పిటల్స్లో భారీ డేటా లీక్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందిన రోగుల వ్యక్తిగత వివరాలు, వైద్య రికార్డులు, ఉద్యోగుల సమాచారం, సంస్థ అంతర్గత డేటా ఓ వెబ్సైట్లో ప్రత్యక్షమైనట్లు ఆసుపత్రి యాజమాన్యం గుర్తించింది.
ఈ ఘటనపై స్టార్ హాస్పిటల్ సీఈఓ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రి సిస్టమ్లోకి అక్రమంగా ప్రవేశించి డేటాను సేకరించి వెబ్సైట్లో ప్రచురించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. వెబ్సైట్ను వెంటనే బ్లాక్ చేసి బాధ్యులను గుర్తించాలని అధికారులు కోరారు.
డేటా లీక్తో మోసాల ముప్పు
సైబర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి వైద్య సమాచారం లీక్ అయితే సైబర్ నేరగాళ్లు రోగుల పేర్లు, ఫోన్ నంబర్లు, చికిత్స వివరాలను ఉపయోగించి నకిలీ కాల్స్ చేయవచ్చు.
“మీరు స్టార్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు”, “మీ రిపోర్టులు వచ్చాయి”, “ఈ మందులు వెంటనే కొనాలి”, “ముందుగా ఆన్లైన్ చెల్లింపు చేయండి” అంటూ నమ్మించి డబ్బులు దోచుకునే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
అందువల్ల తెలియని నంబర్ల నుంచి వచ్చే వైద్య సంబంధిత కాల్స్, మెసేజ్లు, చెల్లింపు లింకుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఆసుపత్రి పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా సంబంధిత ఆసుపత్రిని సంప్రదించి మాత్రమే స్పందించాలని సూచిస్తున్నారు.

