వాటర్ బోర్డ్ పేరుతో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగుచూస్తున్నాయని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ T. Sai Manohar హెచ్చరించారు. నీటి కనెక్షన్, మీటర్ అప్డేట్, బిల్ వెరిఫికేషన్ లేదా CAN నంబర్ ధృవీకరణ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.
సైబర్ నేరగాళ్లు బాధితులకు వాట్సాప్ సందేశాలు, ఎంఎంఎస్లు లేదా ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదిస్తూ “మీ మీటర్ అప్డేట్ కాలేదు”, “మీటర్ రీడింగ్ నమోదు కాలేదు”, “CAN నంబర్ వెరిఫికేషన్ పెండింగ్లో ఉంది” లేదా “నీటి కనెక్షన్ నిలిపివేయబడుతుంది” వంటి సందేశాలతో భయాందోళనలకు గురిచేస్తున్నారు.
సమస్యను పరిష్కరిస్తామని చెప్పి APK ఫైల్ లేదా QuickSupport వంటి రిమోట్ యాక్సెస్ యాప్లను డౌన్లోడ్ చేయాలని సూచిస్తున్నారు. కొన్నిసార్లు కేవలం రూ.10, రూ.13 లేదా రూ.20 మాత్రమే చెల్లించాలని చెప్పి బాధితుల నమ్మకాన్ని సంపాదిస్తున్నారు.
అయితే ఆ యాప్లు ఇన్స్టాల్ చేసిన వెంటనే మొబైల్ ఫోన్పై నేరగాళ్లకు పూర్తి నియంత్రణ లభిస్తుంది. ఫోన్ హ్యాక్ కావడం, స్క్రీన్ స్పందించకపోవడం, బ్యాంకింగ్ యాప్లు మరియు వ్యక్తిగత సమాచారం వారి చేతికి వెళ్లిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది బాధితులకు వీడియో కాల్స్ ద్వారా సూచనలు ఇస్తూ, UPI లేదా బ్యాంకింగ్ యాప్లలో కొన్ని చర్యలు చేయించాలని కోరుతున్నారని అధికారులు తెలిపారు.
దీంతో బాధితులకు తెలియకుండానే వారి బ్యాంకు ఖాతాలు, UPI ఖాతాలు, క్రెడిట్ కార్డుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు డెబిట్ అవుతున్నాయి. ఇటీవల నమోదైన పలు ఫిర్యాదుల్లో బాధితులు వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు నష్టపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాటర్ బోర్డ్ లేదా ఇతర ప్రభుత్వ సంస్థల పేరుతో వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మవద్దని, ముఖ్యంగా వాట్సాప్ లేదా ఎంఎంఎస్ ద్వారా వచ్చే APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
అలాగే OTP, CVV, UPI PIN, బ్యాంక్ పాస్వర్డ్ వంటి గోప్యమైన వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. మోసానికి గురైనట్లు అనుమానం వచ్చిన వెంటనే మొబైల్ డేటా లేదా ఇంటర్నెట్ కనెక్షన్ నిలిపివేసి, అనుమానాస్పద యాప్లను తొలగించాలని తెలిపారు. అనంతరం బ్యాంక్ ఖాతాలు, కార్డులు, UPI సేవలను బ్లాక్ చేయించి, పాస్వర్డ్లను మార్చుకోవాలని సూచించారు.
అలాగే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు కాల్ చేయడంతో పాటు National Cyber Crime Reporting Portal లో ఫిర్యాదు నమోదు చేయాలని డీసీపీ సూచించారు.
ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి మోసాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి అపరిచిత లింకులు, APK ఫైళ్లు, రిమోట్ యాక్సెస్ యాప్ల విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

